Fuel Crisis: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష!

Fuel Crisis Hyderabad

Fuel Crisis Hyderabad

Fuel Crisis Hyderabad: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం మన రాష్ట్రాలు పై కూడా పడుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. దీంతో తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఎక్కడ స్టాక్ అయిపోతుందో అన్న భయంతో ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా, విడిగా క్యాన్లలో కూడా నింపుకుంటున్నారు. దీనివల్ల ఉన్న నిల్వలు కూడా వేగంగా ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే కొన్ని బంకులు మూతపడటం ప్రజల్లో మరింత ఆందోళన నింపింది. అయితే, రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, రవాణా వ్యవస్థ ఆగిపోకుండా పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

మరోవైపు రైతన్నల కోసం యూరియా, ఇతర ఎరువుల నిల్వలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సాగు సీజన్ దృష్ట్యా ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే విదేశీ దిగుమతులు నిలిచిపోయినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఇంధనాన్ని ఎలా తీసుకురావాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజలకు ఒక్కటే విన్నపం.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. ప్రభుత్వం దగ్గర అవసరమైన మేర చమురు నిల్వలు ఉన్నాయి. అవసరం ఉన్నంత వరకే ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బంకుల వద్ద క్యూ లైన్లు తగ్గించడానికి, సరఫరాను క్రమబద్ధీకరించడానికి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఆశిద్దాం.