SBI Minimum Balance Update: సాధారణంగా బ్యాంకులో అకౌంట్ ఉందంటే చాలు.. నెలాఖరు రాగానే అందులో కనీసం ఇంత డబ్బు ఉండాలి లేకపోతే పెనాల్టీ పడుతుందేమో అన్న భయం అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులు, చిరుద్యోగులు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి వారి కోసం ఒక తీపి కబురు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 72 కోట్ల మంది ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదని, ఒకవేళ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నా ఎలాంటి జరిమానాలు వేయకూడదని ఆమె స్పష్టం చేశారు.
పార్లమెంటులో ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన అకౌంట్లు అన్ని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. అంటే, ఈ ఖాతాల్లో రూపాయి లేకపోయినా (జీరో బ్యాలెన్స్) బ్యాంకులు ఒక్క పైసా కూడా పెనాల్టీ రూపంలో కట్ చేయడానికి వీల్లేదు. కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఈ అకౌంట్లకు ఇచ్చే ఏటీఎం కార్డులు, నగదు ఉపసంహరణలు డిపాజిట్లపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు, సాధారణ సేవింగ్స్ ఖాతాల విషయంలో బ్యాంకులు తమ సొంత నిబంధనలు పాటించవచ్చని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ చార్జీలు వసూలు చేసేటప్పుడు బ్యాంకులు హేతుబద్ధంగా ఉండాలని, కస్టమర్లపై పెను భారం పడకుండా చూసుకోవాలని సూచించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 8 వేల కోట్ల రూపాయలకు పైగా జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.23 శాతం మాత్రమేనని, కేవలం నిర్వహణ ఖర్చుల కోసమే ఈ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి.
ముఖ్యంగా మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఇప్పటికే 2020 మార్చి నుంచే సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. దీనిని అనుసరిస్తూ 2025 నాటికి మరో 9 ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ పెనాల్టీల భారాన్ని తగ్గించాయి. విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతుల పెట్టుబడి సాయం, మహిళలకు అందే ప్రభుత్వ పథకాల డబ్బులు ఇలాంటి చార్జీల వల్ల కట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బ్యాంకింగ్ సేవలను సామాన్యులకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, తక్కువ ఆదాయం ఉన్నవారు నిశ్చింతగా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఇకపై మీది బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అయితే, బ్యాలెన్స్ తగ్గిందన్న దిగులు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు.
