కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు శుభవార్తలు తీసుకొచ్చింది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగానికి పెద్దపీట వేయడంతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర బడ్జెట్లో India Semiconductor Mission 2.0 కింద రూ.40 వేల కోట్ల నిధులు కేటాయించారు. దీనివల్ల ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే కంపెనీల కలలు కల లాగే ఉండకుండా వాటిని ఆచరణలో పెట్టేలా కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహలు లభించనున్నాయి.
ఈ నేపథ్యంలో కర్నూలు, తిరుపతి జిల్లాలకు అభివృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సెమీకండక్టర్ తయారీ, టెస్టింగ్, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్ యూనిట్ల కోసం 2024–29 ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పుకోవచ్చు.
కర్నూలులో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి Indichip Semiconductors ముందుకు వచ్చింది. జపాన్కు చెందిన Yitoa Micro Technology Corporation భాగస్వామ్యంతో ఈ కంపెనీ రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ తయారీ యూనిట్గా నిలవనుంది.
ఇక తిరుపతిలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పరిశ్రమలు రావడంతో స్థానిక యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, కేంద్ర బడ్జెట్ ప్రభావంతో సెమీకండక్టర్ రంగంలో ఏపీ కీలక కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్నూలు, తిరుపతికి ఇది నిజంగా “మహర్దశ” అని చెప్పవచ్చు.
https://varthaprabhanjanam.com/egg-65-recipe-at-home-quick-tasty-snack-for-kids/
