Middle East Conflict 2026: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. కేరళలోని పాలక్కాడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల క్షేమమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా కేరళ నుంచి ఉపాధి కోసం వెళ్లిన వేలాది మంది ప్రవాసీయుల గురించి కేంద్రం నిరంతరం ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని ప్రధాని తెలిపారు. “యుద్ధం వల్ల కలిగే ఆర్థిక, ఇతర ప్రభావాలు భారతదేశంపై పడకుండా మా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గల్ఫ్ దేశాల అధినేతలతో నేను స్వయంగా టచ్లో ఉన్నాను. అక్కడ చిక్కుకున్న మన సోదర సోదరీమణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి” అని మోదీ వివరించారు. మన దేశ రాయబార కార్యాలయాలు రోజుకు 24 గంటల పాటు పని చేస్తూ సహాయం అందిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సున్నితమైన ఈ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇది గల్ఫ్లో ఉన్న భారతీయుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా ఉందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రాల పాలనపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. కేరళలో ఎల్డీఎఫ్ (Left) ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, డీఏ (DA) చెల్లించడంలో విఫలమైందని విమర్శించారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో కూడా ఉందని, అక్కడ అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు.
