Brazil Social Media Ban: ఆస్ట్రేలియా బాటలోనే ఇప్పుడు బ్రెజిల్ కూడా పయనిస్తోంది. చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ మంగళవారం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇంటర్నెట్లో పెరుగుతున్న హింస, అసభ్యకర కంటెంట్ నుంచి పిల్లలను రక్షించడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తోంది.
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం, 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే కచ్చితంగా వారి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కేవలం “నా వయసు 18 ఏళ్లు” అని టిక్ మార్క్ పెడితే ఇకపై కుదరదు. దీనికోసం పటిష్టమైన వయసు నిర్ధారణ పద్ధతులను కంపెనీలు పాటించాల్సి ఉంటుంది.
ఐడెంటిటీ కార్డు ఉంటేనే ఎంట్రీ!
ప్రస్తుతానికి యూజర్లు తమ గుర్తింపు కార్డులను అప్లోడ్ చేయడంతో పాటు, బయోమెట్రిక్ ఫోటో వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని జాతీయ డేటా రక్షణ సంస్థ డైరెక్టర్ ఇయాగే మియోలా తెలిపారు. వయసు దాచి అకౌంట్లు తెరిచే పద్ధతికి దీనివల్ల స్వస్తి పలకవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
భారీ జరిమానాలు.. అవసరమైతే నిషేధం
ఈ చట్టాన్ని ఉల్లంఘించే టెక్ సంస్థలకు బ్రెజిల్ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది:
నిబంధనలు పాటించని కంపెనీలకు 9 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ రియల్స్) వరకు జరిమానా విధిస్తారు.
తప్పులు పునరావృతమైతే సదరు సోషల్ మీడియా యాప్ను దేశంలో పూర్తిగా నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
పిల్లలను ఆకర్షించే ప్రకటనలు, వీడియో గేమ్లలో ఉండే ‘లూట్ బాక్స్ల’పై కూడా నిషేధం విధించారు.
ఎందుకు ఈ నిర్ణయం
గత ఏడాది ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో చిన్నారుల లైంగిక వేధింపుల ఉదంతం బ్రెజిల్లో పెను సంచలనం సృష్టించింది. దాదాపు 21 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్లో ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువ. వ్యసనంగా మారుతున్న అల్గారిథమ్ల నుంచి, సైబర్ నేరాల నుంచి భావి తరాలను కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థనే నియంత్రించేలా ఈ చట్టాన్ని రూపొందించడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా ఇలాంటి చట్టాన్ని తీసుకురాగా, ఇప్పుడు బ్రెజిల్ కూడా అదే దిశగా అడుగులు వేసింది. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు మొదలవ్వడం గమనార్హం.
